మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు
తెలంగాణ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మటన్ కూరలో కారం ఎక్కువైందని భార్యను భర్త తిట్టాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ముఖ్యంగా, వివాహం జరిగిన కేవలం ఆరు రోజుల్లోనే నవవధువు చిన్న విషయానికే ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా విషాదం నెలకొంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులోని వడ్డెర కాలనీకి చెందిన అల్లెపు గంగోత్రి (22) అదే కాలనీకి చెందిన సంతోష్ ప్రేమించి పెద్దలను ఒప్పించి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.
సెప్టెంబరు 26వ తేదీన వీరి వివాహం జరగ్గా దసరా పండుగ సందర్భంగా 2వ తేదీన గంగోత్రి భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. కొత్త అల్లుడి కోసం అత్తింటివారు పిండివంటలతో పాటు మటన్ కూర వండిపెట్టారు. అయితే, గంగోత్రి మటన్ కర్రీ చేయగా అందులో కారం ఎక్కువైందని భర్త సంతోష్ గొడవకు దిగాడు.
పైగా, అదే రోజు రాత్రి భార్యను తీసుకుని తమ ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ మళ్లీ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భర్త తీరుతో కుమిలిపోయి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పండగపూట ఆ ఇంటి విషాదం నెలకొంది. గంగోత్రి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.