1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఎంజీ
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (22:37 IST)

మీ భర్త వద్దు అంటున్నావు కదా నాతో ఉండు: మహిళ ఆరోపణ

భర్త వేధిస్తున్నాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై సానుభూతి చూపించాల్సిన ఎస్ఐ వేధించటం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై డీజీపీ కార్యాలయంలో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

కృష్ణాజిల్లా కలిదండ ఎస్ఐ పదేపదే స్టేషన్కు పిలుస్తూ సహజీవనం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలు కొక్కిలిగడ్డ లక్ష్మీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం మంగళగిరిలోని డిజిపీ కార్యాలయానికి చేరుకొని ఫిర్యాదు చేసేందుకు వచ్చింది.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమె భర్తపై ఫిర్యాదు చేస్తే ఎస్సై తనని స్టేషన్ ఒకరోజు రాత్రంతా స్టేషన్లోనే ఉంచాడని ఆరోపిస్తోంది. మీ భర్త వద్దు అంటున్నావు కదా నాతో ఉండు నిన్ను నేను ఏ లోటు లేకుండా చూసుకుంటా అని పదే పదే ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిపింది.

అదేమిటని అడిగితే తనపై కేసు నమోదు చేశారని తెలిపింది. సిఐ దృష్టికి తీసుకెళ్తే ఎస్సైకి మద్దతుగా మాట్లాడుతున్నారని తెలిపింది. తనకు న్యాయం చేసి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విన్నవించుకునేందుకు డిజిపి ఆఫీసుకు వచ్చానని తెలిపింది.

శనివారం కావడంతో కార్యాలయానికి సెలవు అని ఫిర్యాదు సేకరించేందుకు సోమవారం రావాలని బాధితురాలిని డీజీపీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడటం గమనించిన వారు ఆమెను పిలిపించి ఫిర్యాదు స్వీకరించటం గమనార్హం. ఫిర్యాదుపై విచారించి ఎస్సైపై చర్యలు తీసుకుంటామని డిజిపీ కార్యాలయంలో అధికారులు హామీ ఇచ్చారని ఆమె తెలిపింది.