1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 మే 2024 (11:39 IST)

తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన యువతికి జైలుశిక్ష!!

crime
ఓ యువకుడిపై తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన ఓ యువతిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పుడు పను చేయొద్దని హెచ్చరిస్తూ, నాలుగేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. చట్టాన్ని దుర్వనియోగ పరిచినందుకుగాను ఈ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, బాధితుడికి రూ.5.8 లక్షల పరిఙారం చెల్లించాలని ఆదేశించింది. యువతి ఆరోపణల కారంగా అండర్ ట్రయల్ ఖైదీగా మారిన యువకుడు తన ఆదాయాన్ని కోల్పోయినందుకు ఈ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 2019లో యువతికి 15 యేళ్ళ వయసున్నపుడు ఆమె తల్లి ఈ కేసు దాఖలు చేసింది. యువతి, ఆమె సోదరితో కలిసి ఓ కంపెనీలో పని చేస్తున్న అజయ్ అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడని ఆమె తల్లి ఆరోపించింది. తరచూ తమ ఇంటికొచ్చే అతడికి బాలికతో స్నేహం ఏర్పడిందని, దీన్ని అవకాశంగా తీసుకున్న అతడు ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. 
 
అయితే, విచారణ సందర్భంగా యువతి మాట మార్చింది. అజయ్ తనను కిడ్నాప్ చేయలేదని, అత్యాచారం చేయలేదని పేర్కొంది. దీంతో కోర్టు యువతిపై మండిపడింది. "ఇలాంటి వారి వల్ల అసలైన బాధితులు ఇక్కట్లపాలవుతున్నారు. సమాజంలో ఇదో ఆందోళనకరపరిస్థితి. తమ లక్ష్యం కోసం పోలీసు, న్యాయవ్యవస్థలను దుర్వినియోగపర్చడం, ఆమోదయోగ్యం కాదు. పురుషులు ప్రయోజనాలకు నష్టం కలిగించే అవకాశాన్ని మహిళలకు ఇవ్వరాదని పేర్కొంటూ నాలుగేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.