1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మే 2024 (13:09 IST)

మూగ కుమారుడిని మొసళ్ళ నదిలో విసిరేసిన తల్లి.. ఎక్కడ?

crocodile - chicken
కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఓ అమానీవయ ఘటన జరిగింది. పుట్టు మూగ కొడుకు విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై ఇటీవల మరోమారు ఆ దంపతుల మధ్య తరచూ ఘర్షణ జరిగింది. దీంతో ఆ భార్య మనసు పాషాణంగా మారిపోయింది. దీంతో కన్నబిడ్డను మొసళ్ళ నదిలో విసిరేశాడు. ఈ అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి కుమార్, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు పుట్టు మూగ. దాంతో ఆ పిల్లాడి విషయమై సావిత్రితో భర్త తరచూ గొడవ పడేవాడు. ఎందుకు అలా మూగవాడికి జన్మనిచ్చావంటూ, ఆ పిల్లావాడిని ఎక్కడైనా వదిలేసి రావాలని భార్యతో రవి కుమార్ మూర్ఖంగా ఘర్షణపడేవాడు. ఈ విషయమై శనివారం సాయంత్రం మరోసారి వారి మధ్య గొడవ జరిగింది. భర్త గొడవలతో విసిగెత్తిపోయిన సావిత్రి మూగ కొడుకును తీసుకెళ్లి మొసళ్లు ఉండే కాళి నదిలో విసిరేసింది. సావిత్రి తన కుమారుడిని నదిలో విసిరేయడం చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో బాలుడి కోసం వెతికించారు.
 
కానీ, అప్పటికే చీకటి పడడంతో బాలుడు దొరకలేదు. ఆదివారం ఉదయం బాలుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పిల్లాడి శరీరంపై గాయాలు ఉండడంతో పాటు ఒక చేయి కూడా లేకపోవడంతో మొసళ్లు దాడి చేసి ఉంటాయని పోలీసులు వెల్లడించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్న దండేలి రూరల్ పోలీసులు వారిపై సెక్షన్ 109, 302 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.