ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (15:14 IST)

కాళ్లపారాణి ఆరకముందే నవవధువు అనుమానాస్పద మృతి

suicide
కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు అనుమానాస్పదంగా చనిపోయింది. ఆ తర్వాత తన భార్య పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుందని నమ్మించేందుకు కిరాతక భర్త ప్రయత్నించాడు. కర్నాటక రాష్ట్రంలోని ధార్వాడలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ధర్వాడ జిల్లా అనేరికి అనే గ్రామానికి చెందిన షహబాద్ ములగంజ (26)కు గదగ్ జిల్లా గజేంద్రడకు చెందిన షహనాజ్ బేగం (24) అనే యువతిని ఇచ్చి నెలన్నర క్రితం వివాహం చేశారు. వివాహ సమయంలో వధువు తరపు వారు వరుడికి కట్న కానుకలు బాగానే అందజేశారు. ఆ తర్వాత సకల లాంఛనాలతో తమ బిడ్డను అత్తారింటికి పంపించారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత ములగంజ అసలు నిజస్వరూపం తెలియవచ్చింది. అదనపు కట్నం కోసం వేధించసాగాడు. ములగంజ తల్లిదండ్రులు కూడా కొడుకు వత్తాసు పలికి, షహనాజ్‌ను కట్నం కోసం వేధించసాగారు. దీంతో నవ వధువు తాను మోసపోయానని కుమిలిపోసాగింది. 
 
ఈ క్రమంలో రంజాన్ పండుగ రోజున అందరూ పండుగ సంబరాల్లో మునిగివుండగా, షహనాజ్ బేగం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుందని ములగంజ తన అత్తమామలకు సమాచారం చేరవేశాడు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించసాగారు. ఆ తర్వాత అల్లుడిపై అత్తింటివారు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం పేరుతో తమ కుమార్తెను హింసించి హత్య చేశారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు.