శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (17:34 IST)

అదృష్టవంతులెవరో? కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిపదవి దక్కేనా?

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఏకంగా నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి సీనియర్ నేత కిషన్ రెడ్డి విజయం సాధిస్తే, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, అదిలాబాద్ నుంచి సోయం బాపూరావు గెలుపొందారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో తెలంగాణాకు కేంద్ర మంత్రి పదవి ఒకటి ఖాయమని తేలిపోయింది. ఇపుడు ఆ ఒక్కటి ఎవరిని వరిస్తుందన్న అంశంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. 
 
గత 2014 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒక్క లోక్‌సభ స్థానంలోనే విజయం సాధించింది. సికింద్రాబాద్‌ నుంచి గెలుపొందిన దత్తాత్రేయకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించారు. కొంతకాలం కేంద్రమంత్రిగా పనిచేసిన తర్వాత దత్తాత్రేయను తొలగించారు. దీంతో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలుపొందడంతో కేంద్ర కేబినెట్‌లో ఒకరికి మాత్రం బెర్తు ఖాయంగా కనిపిస్తోంది. 
 
ప్రస్తుతం ఎంపికైన నలుగురిలో ఎక్కువ అవకాశాలు కిషన్ రెడ్డికే ఉన్నాయి. ఎందుకంటే.. రాష్ట్ర పార్టీలో సీనియర్‌ నేత. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో కేంద్రమంత్రిగా ఆయనకే అవకాశాలెక్కువ ఉన్నాయి. యువకులకు అవకాశం ఇవ్వాలని మోడీ భావిస్తే, కిషన్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లేకపోతే, యువతను ఆకర్షించి కరీంనగర్‌ లోక్‌సభ నుంచి గెలుపొందిన బండి సంజయ్‌కి కూడా కేంద్రమంత్రి పదవి దక్కవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అరవింద్‌కి సైతం కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. సీఎం కేసీఆర్ కుమార్తె, కవిత నుంచి గట్టి పోటీ ఎదురైనా 68 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అదివాసి తెగకు చెందిన‌ సోయంకు మంత్రిగా అవకాశం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. సామజిక సమీకరణల పరంగా తనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆయన భావిస్తున్నారు. తెలంగాణలో బలపడేందుకు బీజేపీకి మంచి అవకాశం దక్కింది.