మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (23:09 IST)

కొమురం భీం జిల్లాలో తిష్టవేసిన పెద్దపులి, మనిషి రక్తం మరిగిన పెద్దపులి చాలా డేంజర్?

క్రూర మృగాలు, అందులోను ప్రత్యేకించి సింహాలు, పెద్దపులులు మనిషి రక్తం రుచి మరిగితే ఇక అక్కడే తిష్టవేసి మళ్లీ మనిషి కోసమే చూస్తాయనేందుకు కొన్ని ఉదంతాలున్నాయి. ఇటీవలే కొమురం భీమ్ జిల్లాలో ఓ యువకుడు పులివాత పడ్డాడు. పులిని పారదోలేందుకు ప్రయత్నించినా అది ఆ యువకుడిని వదల్లేదు. పొట్టనపెట్టుకుంది. ఈ పులి కోసం 12 బృందాలు రంగంలోకి దిగాయి కానీ అది ఇప్పటివరకూ ఆచూకి లేదు.
 
కాగా ఈరోజు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ వద్ద నడి రోడ్డుపై కనిపించిన పెద్ద పులి అక్కడి వారి వెంటపడటం కలకలం రేపుతోంది. రోడ్డుపైకి వచ్చిన పెద్దపులి ప్రయాణికులను, పాదచారులను వెంటాడింది. ఇద్దరు యువకులను దాదాపు పట్టుకునేందుకు సమీపించేంతలో వారు చెట్టెక్కి ప్రాణాలను కాపాడుకున్నారు.
మనుషులను జంతువులు వెంటబడటం, చంపడం చాలా అరుదుగా వుంటుందని వన్యప్రాణ సంరక్షకులు చెపుతారు. ఐతే క్రూరమృగం మనిషి రక్తం రుచి చూస్తే ఇక మళ్లీ మనిషి ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తుందనేందుకు ఉదాహరణలున్నాయి. దానికి కారణం మనిషి రక్తం ఉప్పగా వుంటుంది. ఇది ఇతర జంతువుల మాదిరిగా వుండదు. అందువల్ల మనిషి రక్తం చూసిన జంతువు మళ్లీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుంది.
 
ఇదే కారణంతో జంతువులు మనుషులను చంపే సీరియల్ కిల్లర్లుగా మారవచ్చు. జంతు నిపుణులు దీనిపై పలు పరిశోధనలు చేసారు. ఇటీవల, నేపాల్‌లో ఆకలితో ఉన్న చిరుతపులి గత 15 నెలల్లో కనీసం 15 మందిని చంపి తినేసిందని అక్కడివారు చెపుతున్నారు. చిరుత పులులు, పెద్దపులులు మానవులను వేటాడటం ప్రారంభించడం మొదలుపెడితే వాటిని ఆపడం కష్టమని ఖాట్మండులోని జాతీయ ఉద్యానవనాలు మరియు వన్యప్రాణుల సంరక్షణ శాఖ అధికారి అభిప్రాయం వ్యక్తం చేసారు.
"మానవ రక్తం జంతువుల రక్తం కంటే ఎక్కువ ఉప్పును కలిగి ఉన్నందున, ఒకసారి అడవి జంతువులకు ఉప్పగా ఉండే రక్తం రుచి చూస్తే ఇక అవి జింక వంటి ఇతర జంతువులను ఇష్టపడవు" అని ఆ అధికారి వివరించారు. అంతేకాదు, మనుషులు వన్యప్రాణుల కోసం గతంలో రిజర్వు చేసిన ప్రాంతాలలోకి ఎక్కువగా చొరబడటం వల్ల వాటి ఆవాసాలు నాశనమవుతున్నాయి. ఫలితంగా అవి మనుషులపై దాడి చేస్తున్నాయి.
 
చాలా కాలం కిందట చంపావత్ అనే ఆడపులి మనిషులను తినే పులిగా ముద్ర పడింది. ఇది నేపాల్ దేశంలో సుమారు 200 మందిని పొట్టనబెట్టుకుంది. పులివాత పడ్డవారిలో పురుషులు, మహిళలు కూడా వున్నారు. ఆ పులిని అటవీశాఖ అధికారులు నేపాల్ నుంచి తరిమివేసారు. అది ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్ జిల్లాకు వచ్చి అక్కడ దాదాపు 236 మందిని పొట్టనబెట్టుకుంది.
ఇది కేవలం మనుషుల రక్తం రుచి మరగడం మూలంగా జరిగిన దారుణంగా చెపుతారు. ఐతే ఇది వాస్తవం కాదని మరికొందరు వాదిస్తుంటారు. ఏదేమైనప్పటికీ కొమురం భీం ప్రాంతంలో పెద్దపులులు సంచారం ఎక్కువగా వున్నందువల్ల, ఇటీవలే యువకుడిని చంపినందువల్ల ఆ ప్రాంతానికి మనుషులు దూరంగా వుండాలి. అటవీశాఖ అధికారులు ఆ పులిని పట్టుకునేవరకూ జాగ్రత్తగా వుండాలి.