శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (15:15 IST)

గ్యాస్ట్రో కూడా కరోనా లక్షణమే.. నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు

కరోనా లక్షణాలు జ్వరం, జలుబు, దగ్గు, వాసన, రుచిని కోల్పోవడం వంటివని వైద్యులు చెప్తున్నారు. కానీ తాజాగా అయితే వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, వికారం వంటి లక్షణాలు కనిపించినా వైరస్‌ సోకిందేమోనని అనుమానించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ మంది గ్యాస్ట్రో సంబంధిత సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనివల్ల వైరస్‌ తీవ్రత పెరిగి సమస్య మరింత జటిలమవుతోందంటున్నారు. 
 
కోవిడ్‌ బారినపడిన, వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయని కేజీహెచ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గిరినాథ్ అంటున్నారు. అయితే చాలామంది వాటిని సాధారణ సమస్యలుగానే భావించి నిర్లక్ష్యం చేస్తుండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
  
కోవిడ్‌ వైరస్‌ బాధితుల్లో సాధారణంగా కనిపించే లక్షణాలకు భిన్నంగా కొంతమందిలో గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. వైరస్‌ బారినపడుతున్న ప్రతి వంద మందిలో 20 మందికి జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించడం లేదు. 
 
వీరిలో ఆకలి తగ్గడం, వికారం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవి కొవిడ్‌ లక్షణాల్లో లేకపోవడం వల్ల చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల వైరస్‌ తీవ్రత పెరిగి మరికొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.