గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (21:47 IST)

బార్లీ వాటర్.. నిమ్మరసం, తేనెను కలుపుకుని పరగడుపున తాగితే?

బార్లీ గింజలు కొలెస్ట్రాల్‌ను బాగా అదుపు చేస్తాయి. రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్‌ను అదుపు చేసే గుణం వీటిలో పుష్కలంగా వున్నాయి. అలాగే బార్లీ గింజల్లో పోటాషియమ్‌ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. బార్లీలో పీచు పదార్థాలు ఎక్కువ. అందువల్ల అది జీర్ణాశయపు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. 
 
బార్లీలోని పీచుపదార్థాల వల్ల అవి రక్తంలో చక్కెరను అతి మెల్లగా విడుదలయ్యేలా చేస్తాయి. దాంతో మధుమేహం అదుపులో వుంటుంది. ఈ కారణం వల్లనే అవి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంతో పాటు, డయాబెటిస్‌ లేనివారిలో నివారణకూ తోడ్పడతాయి. 
 
బార్లీలోని విటమిన్-ఏ కారణంగా ఇవి కంటిచూపును దీర్ఘకాలం పాటు పదిలంగా కాపాడతాయి. వీటిల్లో ఐరన్‌ కూడా ఎక్కువే. అందువల్ల రక్తహీనతను నివారిస్తాయి. బార్లీలో ఉండే క్యాల్షియమ్, ఫాస్ఫరస్‌ ఎముకలను మరింత శక్తిమంతం చేస్తాయి. ఇంకా బార్లీ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 
 
ఇంకా బార్లీ గింజల్ని నానబెట్టిన నీటిని పరగడుపునే తాగితే శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. పెద్ద పేగును శుభ్రపరిచి కోలన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ నీరు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఈ నీటిలో ఉండే పోషకాలు శరీర మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి. దీంతో బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 
 
ఒక లీటరు నీటిలో గుప్పెడు బార్లీ గింజలను వేసి.. పావు గంట పాటు బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి, వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని నిత్యం పరగడుపున తాగిన వారికి ఒబిసిటీ సమస్య వుండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.