శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:09 IST)

పురుషుల కన్నా స్త్రీలకే గుండెజబ్బులు ఎక్కువట? ఎందుకంటే?

పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడటానికి ప్రధాన కారణం వారికి రక్తనాళాలు పురుషుల కన్నా సన్నగా ఉంటాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుంటే అది మరో కారణం అవుతుంది. వీటికి తోడు స్థూలకాయం, మధుమేహం, మానసిక ఒత్తిళ్లు, శరీర శ్రమ లేకపోవడం, మెనోపాజ్‌, స్త్రీల గుండె పోటుకు ఇతర కారణాలు. 
 
సాధారణంగా నిత్యం గుండె ద్వారా జరిగే రక్త ప్రసరణకు, రుతుస్రావానికీ మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల రుతుక్రమంలో అస్తవ్యస్తం చోటుచేసుకున్నప్పుడు, అది గుండె పనితనాన్ని ప్రభావితం చేసి గుండె జబ్బులకు దారితీయవచ్చు. నిజానికి, రుతుధర్మం స్త్రీల శరీర మాలిన్యాలను శుభ్రపరిచే ఒక రక్తమోక్షణ ప్రక్రియ. ఆ ప్రక్రియ కుంటుపడితే గుండె పనితనంలో మార్పులు రావడం సహజం.
 
అందువల్ల రుతుక్రమం విషయాల్లో ఏ కాస్త తేడా వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అమితాహారం, విరుద్దాహారం తీసుకోవడం, రక్తహీనత, అజీర్తి సమస్యలు కూడా రక్తప్రసరణ వ్యవస్థ కుంటుపడటానికీ, గుండె జబ్బులు రావడానికి కారణమవుతాయి. గుండె జబ్బులు రావడానికి శారీరక కారణాలతో పాటు, మానసిక ఒత్తిళ్లు కూడా కారణమే కాబట్టి, వీటిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానాలు తప్పనిసరిగా అలవర్చుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. అంటే ద్రవ పదార్ధాలు, జ్యూస్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి. 
 
రోజూ కనీసం నాలుగు లీటర్లు నీళ్లు తాగాలి.  వెల్లుల్లి, అల్లం, శొంఠి, ఆవాలు, పసుపు ఆహారంలో భాగం చేసుకుంటే గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు, ఇతర కల్మషాలు తొలగిపోతాయి. సాధారణ ఔషధమూలికల్లో మద్ది (అర్జున), యష్టిమధు, పుష్కరమూలం, పిప్పళ్లు, వాము వీటిని ప్రతిరోజూ తీసుకోవచ్చు. లేదా ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణ తీసుకోవచ్చు. అయితే, హృద్రోగాల విషయంలో ఔషధ చికిత్సలకు వెళ్లాలా లేక శస్త్ర చికిత్సలు చేయించుకోవాలా అనే నిర్ణయాన్ని రోగ నిర్ధారణా పరీక్షల ఆధారంగానే తీసుకోవాలి.