1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 12 ఆగస్టు 2021 (20:15 IST)

రక్తపోటు(బిపి) వచ్చాక నయం కావడమనేది వుండదు కానీ ఇలా చేస్తే....

రక్తపోటు... బ్లడ్ ప్రెషర్ వచ్చాక నయం కావడమన్నది ఉండదు. ఐతే జీవనవిధానంలో మార్పులు ద్వారా రాకుండా జాగ్రత్తపడొచ్చు. జీవితంలో చిన్నచిన్న మార్పుల ద్వారా నియంత్రణలో ఉందుకోవచ్చు. ఆహారంలో ఉప్పు వాడకం  తగ్గించాలి. రోజుకి 5 గ్రాముల కంటే మించి ఉప్పు వాడకూడదు. ప్రాసెస్డ్, ప్యాకేజీ పదార్ధాలతో పాటుగా ఫాస్ట్ పుడ్స్ జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే వాటిలో అదనపు ఉప్పు ఉంటుంది. సోడియం క్లోరైడ్ బిపిని అధికం చేస్తుంది.
 
బి.పి.ని తగ్గించేది పొటాషియం. బీన్స్, జఠాణీలు, గింజ ధాన్యాలు, పాలకూర, క్యాబేజీ, కొత్తిమీర, అరటి, బొప్పాయి, ద్రాక్ష, కమలా, నారింజ, నిమ్మ వంటి పండ్లలలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. తక్కువ సోడియం వుండి ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
 
కొవ్వు పదార్ధాల వల్ల రక్తంలో కొలెస్టిరాల్ పెరిగి బిపి ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపములో ఉన్న కొవ్వులు. వీటి వాడకం తగ్గించాలి. ఏ రకమైన పచ్చళ్ళు, ఆవకాయ, కారం ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ మోతాదులో వాడాలి. జంతు మాంసాలలో కొవ్వు ఎక్కువ ఉంటుంది.
 
ఎక్కువ పీచు పదార్ధం ఉన్నవాటినే వాడాలి. పండ్లు, కాయకూరలు, ఆకు కూరలు, పప్పులు వాడాలి. ఆల్కహాలు అలవాటు వున్నవారు దానిని మానివేయాలి. అలాగే పొగత్రాగడం జోలికి పోరాదు.