శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (20:17 IST)

కరోనాకు అంటు వ్యాధులు తోడైతే... ఆందోళనలో వైద్యులు

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తికి ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ఈ వైరస్ వ్యాప్తి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా ఈ వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో దేశంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. 
 
నిజానికి గతంలో కంటే ఈ యేడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. ఇది సంతోషించాల్సిన విషయమే. అయితే, ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా, వర్షాకాలం రావడంతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ఉనికి చాటనున్నాయి. దీనిపై హైదరాబాద్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధులు కూడా సోకితే తట్టుకోవడం చాలా కష్టమని హెచ్చరించారు. అదనపు జాగ్రత్తలు తీసుకోకతప్పదని, ఈ సీజనల్ వ్యాధుల నుంచి ఎవరికి వారు రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శానిటైజేషన్, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చన్నారు. 
 
కానీ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని వివరించారు. నివాసాల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. 
 
కరోనా వైరస్ సోకిన రోగికి డెంగ్యూ కూడా సోకితే అది ప్రాణాంతకమే అవుతుందని చెప్పారు. రోగి ఆరోగ్య పరిస్థితి కొద్దిసేపట్లోనే క్షీణిస్తుందని వివరించారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో రోగులు గందరగోళానికి గురవుతున్నారని, జ్వరం వచ్చిన వాళ్లను వారం రోజుల పాటు ఇంటి వద్దనే క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ఒకవేళ ఆ జ్వరం డెంగ్యూ అయితే ఆ వారం రోజుల్లో పరిస్థితి ఎంత విషమిస్తుందో ఊహించలేమని అన్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాలతో పాటు కొవిడ్-19 లక్షణాల్లో జ్వరం కామన్ పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.