మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (12:07 IST)

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై సొంత పార్టీ ఎంపీల అవిశ్వాస తీర్మానం...

rishi sunak
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌పై సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రి వర్గం నుంచి సువెల్లా బ్రేవర్మన్‌ను తప్పిస్తూ, తన మంత్రివర్గంలో మార్పులు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనపై సొంత పార్టీ ఎంపీలు తిరుగుబాటు చేసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం. 
 
రిషి సునాక్‌కు వ్యతిరేకంగా టోరీ ఎంపీ ఆండ్రియా జెర్కిన్స్ సోమవారం అవిశ్వాస లేఖను ప్రయోగించారు. హౌస్ ఆఫ్ కామన్స్ వ్యవహరాలను చూసే 1922 కమిటీ చైర్మన్ గ్రాహమ్ బ్రాడీకి ఆమె ఈ లేఖను సమర్పించారు. ఈ విషయాన్ని ఆండ్రియా ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ.. అవిశ్వాస లేఖను పోస్ట్ చేశారు. "జరిగింది చాలు. నా అవిశ్వాస లేఖను సమర్పించా. రిషి సునాక్‌ను పదవి నుంచి దింపి.. ఆయన స్థానంలో నిజమైన కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే సమయం వచ్చింది" అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 
 
మాజీ ప్రధాని బోరిస్ జాన్స్‌కు నమ్మిన వ్యక్తిగా పేరున్న ఆండ్రియా.. కేబినెట్ నుంచి సువెల్లా బ్రేవర్మన్‌ను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆమె ఈ 'అవిశ్వాస' లేఖను సమర్పించారు. రిషి సునాక్ తన మంత్రివర్గంలో నిజాలు మాట్లాడే ఏకైక వ్యక్తి సువెల్లాపై వేటు వేశారని, దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. రిషి సునాక్ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస లేఖలు సమర్పించాలని తోటి టోరీ ఎంపీలను ఆమె అభ్యర్థించారు.
 
కాగా.. రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయనపై అవిశ్వాస లేఖ రావడం ఇదే తొలిసారి. అయితే, దీనిపై ఇప్పుడే ఆయన అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. పార్టీకి చెందిన మొత్తం ఎంపీల్లో 15శాతం మంది తాము కొత్త నాయకుడిని కోరుకుంటున్నామంటూ లేఖలు పంపితే అప్పుడు కన్జర్వేటివ్ పార్టీలో రిషి నాయకత్వంపై విశ్వాస పరీక్ష ఓటింగ్ నిర్వహిస్తారు.