శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (13:44 IST)

బ్రిటన్‌లో రూ.1280 కోట్ల విలువైన బంగారం చోరీ.. భారతీయుల గృహాలే టార్గెట్

బ్రిటన్‌లో నివశిస్తున్న భారతీయులు హడలిపోతున్నారు. వీరు నివశించే గృహాలను లక్ష్యంగా చేసుకుని ఇంటి దొంగలు చెలరేగిపోతున్నారు. భారతీయుల గృహాల్లో ఉండే బంగారాన్ని చోరీ చేయడమే లక్ష్యంగా వారు చోరీలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు బీబీసీ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కోంది. 
 
గత ఐదేళ్లలో రూ.1,280 కోట్ల విలువైన బంగారం బ్రిటన్‌లో చోరీకి గురైందనీ, అందులో అత్యధిక భాగం భారత సంతతి ప్రజలదేనని బీబీసీ పరిశోధనలో తేలింది. 2013 నుంచి  చూస్తే 28 వేల బంగారం దొంగతనాలు జరిగాయి. గత ఐదేళ్లలో గ్రేటర్‌ లండన్‌లో రూ.1,050 కోట్ల విలువైన బంగారం దొంగతనానికి గురైంది. 
 
ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా బంగారం ఎంతున్నా దొంగలు కొట్టేస్తున్నారనీ, బంగారాన్ని చాలా తక్కువ సమయంలో, చాలా సులువుగా నగదుగా మార్చుకునే అవకాశం ఉండటం ఇందుకు ఓ కారణమని పోలీసులు చెపుతున్నారు. 
 
దీపావళి, దసరా వంటి భారతీయ ప్రధాన పండుగల సమయంలో ప్రజలు బంగారం ఎక్కువగా ధరించి ఆలయాలకు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తారనీ, ఆ సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని లండన్‌ పోలీసులు చెపుతున్నారు. ప్రతీ యేడాది ఈ పండుగల సమయంలో తాము హెచ్చరికలు కూడా చేస్తామన్నారు.