1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 17 జులై 2021 (15:21 IST)

థర్డ్ వేవ్ ముప్పు.. అప్రమత్తమైన కేంద్రం

దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేప్ తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు.. శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తున్నారు. దీనికితోడు లాక్డౌన్ ఎత్తివేసిన రాష్ట్రాల్లో ప్రజలు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో థర్డ్ వేప్ ముప్పు తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రానున్న 100 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
 
నిజానికి కరోనా రెండో దశ అల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు థర్డ్ వేవ్ భయాందోళనలు కలిగిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో మూడోదశ ప్రారంభమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఏ దేశంలోనూ మహమ్మారి ముగింపునకు రాలేదని.. కొత్త, ప్రమాదకరమైన వేరియంట్లు వైరస్ ఉద్ధృతికి దోహదం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్‌ ప్రారంభమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న 100 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. చాలా దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని వెల్లడించింది. ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కేంద్రం ఆదేశించింది. 
 
ఇప్పటికే ప్రధాని మూడో దశ పై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు మూడో దశ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మరంగా సాగాలని ఆదేశించారు. అమెరికా మినహా స్పెయిన్, థాయిలాండ్, ఆఫ్రికా దేశాల్లో థర్డ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
 
మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. శనివారం నాటి మీడియా బులిటెన్ ప్రకారం గడిచిన 24గంట‌ల్లో మొత్తం 20ల‌క్ష‌ల మందికి కరోనా పరీక్షలు చేయ‌గా… 38,079మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా తో 560 మంది మృతి చెందారు.
 
తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 3,10,64,908కి చేరింది.అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య‌ 4,24,026కి చేరింది. డిశ్చార్జ్ అయిన వారి 3,02,27,792కి పెరిగింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 4,13,091కి చేరింది.