మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (08:14 IST)

140 కోట్ల మంది జనాభాలో వ్యాక్సిన్ ఇచ్చింది 2 శాతమే : ఆంటోనీ ఫౌచీ

భారతదేశఁలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తోందని, దీన్ని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ అమలు చేయాలని అమెరికా అంటు వ్యాధుల నివారణ నిపుణుడు, ఆ దేశాధ్యక్షుడికి ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు. పైగా, 140 కోట్ల మంది జనాభాలో ఇప్పటివరకు కేవలం 2 శాతం మాత్రమే వ్యాక్సిన్ వేశారని గుర్తుచేశారు. మిగిలిన జనాభాకు వ్యాక్సిన్ వేసేందుకు చాలాకాలం పడుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కరోనా వ్యాప్తి నివారణకు లాక్డౌన్ ఒక్కటే ఏకైక మార్గమని తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, భారత్‌ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న ఆయన..  చైనా తరహాలో అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పరిస్థితులను సమగ్రంగా పర్యవేక్షించేందుకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 
 
తక్షణమే ఆక్సిజన్‌, చికిత్సకు అవసరమైన ఔషధాలు, పీపీఈ కిట్లు సమకూర్చుకోవాలని సూచించారు. కొన్ని వారాలు లాక్డౌన్‌తో  పెద్దగా సమస్యలేమీ ఉండవన్నారు. ఇందుకు చైనాను ఉదాహరణగా పేర్కొన్నారు. 
 
అందరికీ టీకాతోనే కరోనా కట్టడి సాధ్యమని ఫౌచీ అన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో ఇప్పటి వరకు 2 శాతం మందే పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ లెక్కన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తవడానికి చాలా కాలం పడుతుందన్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్‌ తయారీ సంస్థలతో వీలైనంత త్వరగా ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. అలాగే భారత్‌లోని సంస్థలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని ఫౌచీ హితవు పలికారు. చైనా తరహాలో భారత్‌లోనూ యుద్ధప్రాతిపదికన కొవిడ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలన్నారు.