1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (08:19 IST)

పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్.. పెట్రోల్ లీటర ధర 51.2 శాతం పెంపు

haseena
పొరుగు దేశం బంగ్లాదేశ్‌‌లో కూడా శ్రీలంక తరహా పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా అక్కడ ఇంధన నిల్వలు అడుగంటిపోతున్నాయి. దీంతో అక్కడ ఇంధన ధరలు ఒక్కసారిగా 52 శాతం మేరకు పెంచేశారు. 
 
ఆ దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఈ స్థాయిలో ఎన్నడూ ఇంధన ధరలు పెరగలేదని అక్కడి మీడియా పేర్కొంది. ఇలా భారీ స్థాయిలో ధరలను పెంచడంతో షేక్‌ హసీనా ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.
 
తాజాగా పెట్రోల్‌ ధర లీటరుకు ఒకేసారి 51.2 శాతం అనగా 44 టాకాలు (బంగ్లాదేశీ కరెన్సీ) పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దీంతో లీటరు పెట్రోల్‌ ధర 130 టాకాలకు పెరిగింది. దీనితోపాటు లీటరు డీజిల్‌పై 34 టాకాలు, ఆక్టేన్‌పై 46 టాకాలు పెంచింది. 
 
పెట్రోల్‌, డీజిల్‌పై యాభై శాతం పెరగగా.. కిరోసిన్‌ ధర కూడా 42శాతం పెరిగింది. ఇలా ఇంధన ధరలను ఒకేసారి భారీ స్థాయిలో పెంచడంపై బంగ్లాదేశ్‌ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బస్సు ఛార్జీలు కూడా పెంచుతున్నట్లు ఆపరేటర్లు ప్రకటించడంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు ఆందోళనలు మొదలుపెట్టారు. 
 
పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, వీటిపై స్పందించిన ప్రభుత్వం.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇంధన ధరలను పెంచాల్సి వచ్చిందని ప్రకటించింది. 
 
ఇదిలావుంటే, 416 బిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ కలిగిన బంగ్లాదేశ్‌.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. అయితే, గత కొంతకాలంగా ప్రపంచ పరిస్థితులు మారడంతో బంగ్లాదేశ్‌ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుగుతున్నట్లు కనిపిస్తోంది.