1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 జూన్ 2023 (16:56 IST)

దేశ ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే అధికారులదే బాధ్యత : కిమ్ జోంగ్ ఉన్

north korea president kim
ఉత్తర కొరియా అధ్యక్షుడు కింమ్ జోంగ్ ఉన్ మరోమారు కీలక ఉత్తర్వులు జారీచేశారు. దేశ ప్రజలు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే దానికి అధికారులో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉత్తర కొరియాలో గత కొన్ని రోజులుగా ఆత్మహత్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 
 
పొరుగు దేశమైన సౌత్ కొరియా నిఘా వర్గాల లెక్కల ప్రకారం గతేడాదితో పోలిస్తే నార్త్ కొరియాలో 40 శాతం ఆత్మహత్యలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కిమ్‌ దేశంలో ఆత్మహత్యలను సోషలిజానికి వ్యతిరేకంగా చేసే రాజద్రోహంగా అభివర్ణించారు. తమ పరిధిలోని వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా అడ్డుకోవడంలో విఫలమైతే స్థానిక అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని కిమ్‌ హెచ్చరించారు. 
 
ఉత్తరకొరియా ఈశాన్య ప్రాంతంలో హామ్‌యాంగ్‌ ప్రాంతానికి చెందిన ఓ అధికారి రేడియో ఫ్రీ ఆసియా (ఆర్‌ఎఫ్‌ఎఏ) సంస్థతో మాట్లాడుతూ ప్రతి ప్రావిన్స్‌ పార్టీ మీటింగ్‌లో వివిధ శ్రేణి నాయకులకు కిమ్‌ అదేశాలను తెలియజేస్తున్నారన్నారు. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకొన్న వారి వివరాలు కూడా వెల్లడిస్తున్నారని తెలిపారు. 
 
ఈ వివరాలు తెలుసుకొని మీటింగ్‌కు హాజరైన వారు కూడా షాక్‌కు గురయ్యారని వెల్లడించారు. ఇక ర్యాంగాంగ్‌ ప్రావిన్స్‌లో ఆకలి చావుల కంటే ఆత్మహత్యలు పెరిగిపోయాయి. కిమ్‌ అదేశాలైతే జారీచేశారు. కానీ, ఎలా అడ్డుకోవాలనే ప్రణాళికలు మాత్రం అధికారుల వద్ద లేవని ఆర్‌ఎఫ్‌ఏ పేర్కొంది. ఉత్తరకొరియాలో అత్యధిక మంది పేదరికం, ఆకలి కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.