మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జులై 2020 (14:22 IST)

కువైట్‌లో భారతీయుల మెడపై వేలాడుతున్న కత్తి?!

కువైట్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకోనుంది. విదేశీ జనాభా చట్టానికి ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే కువైట్ దేశంలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు వెనక్కి రావాల్సివుంటుంది. అంటే దాదాపు 8 లక్షల మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. 
 
కరోనా మహమ్మారి కారణంగా కువైట్ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఆర్థిక వ్యవస్థ పతనమైంది. మరోవైపు ఆ దేశంలోని విదేశీయుల జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. అధికార గణాంకాల ప్రకారం కువైట్‌లో మొత్తం జనాభా 48 లక్షలు. ఇందులో విదేశీయులు 34 లక్షలు. కువైట్‌లోని మొత్తం విదేశీయుల్లో భారతీయుల సంఖ్య 14.5 లక్షలు.
 
కువైట్‌లో స్థానిక జనాభా కంటే విదేశీయుల జనాభా మూడు రెట్లకుపైగా ఉన్నది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదురుకాకుండా ఉండేందుకు మొత్తం జనాభాలో విదేశీయుల జనాభాను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని ఆ దేశ ప్రధాని షేక్ సబా అల్-ఖలీద్ అల్-సబా ఇటీవల నిర్ణయించారు. 
 
దీంతో కువైట్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)కి చెందిన చట్టసభ్యుల కమిటీ ఇటీవల విదేశీయుల జనాభా తగ్గింపునకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లు ప్రకారం కువైట్‌లో భారతీయుల జనాభాను 15 శాతానికి పరిమితం చేశారు. ఈ బిల్లును ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఆమోదిస్తే సుమారు 8 లక్షల మంది భారతీయులు కువైట్‌ను వీడాల్సి ఉంటుంది.