1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (11:46 IST)

మొరాకాలో ఎటు చూసిన శవాల దిబ్బలే... శిథిలాల కింద మృతదేహాలు

morocco earth quake
మొరాకో దేశంపై ప్రకృతి కన్నెర్రజేసింది. శనివారం సంభవించిన భూకంపంలో భారీ సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఈ మృతుల సంఖ్య ఆదివారం ఉదయానికి రెండు వేలకు చేరింది. కూలిపోయిన నిర్మాణాల శకలాలను వెలికి తీసేకొద్దీ మృతదేహాలు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా ఈ మృతుల సంఖ్య 2,012కు చేరింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఓ ఫ్రెంచివాసిని తాజాగా గుర్తించారు. మరో 1404 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
శుక్రవారం రాత్రి 11.11 గంటల సమయంలో సంభవించిన ఈ భూకంపం మారకేష్‌ దాని చుట్టుపక్కల 5 ప్రావిన్సులను భయకంపితులను చేసింది. హై అట్లాస్‌ పర్వతాల వద్ద ప్రాణనష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ మసీదు కటూబియాకు తీవ్రనష్టం వాటిల్లింది. 
 
మూడు రోజులపాటు సంతాపదినాలుగా ప్రకటిస్తూ కింగ్‌ మహమ్మద్‌-6 నిర్ణయం తీసుకొన్నారు. బాధితులకు ఆహారం, పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరుసగా రెండో రోజు కూడా ప్రజలు అర్థరాత్రి వీధుల్లోనే గడిపారు. శిథిల భవనాల నుంచి వీలైనన్ని నిత్యావసరాలను ప్రజలు తమతోపాటు తెచ్చుకొన్నారు. 
 
మరోవైపు మారకేష్‌ ఎయిర్‌ పోర్టు ప్రయాణికులతో నిండిపోయింది. దేశాన్ని వీడి వెళ్లే యాత్రికులు ఎక్కువగా ఉన్నారు. వారంతా నేలపైనే పడుకొన్నారు. విమాన ప్రయాణాల్లో ఎటువంటి మార్పులు లేవు. మరోవైపు ప్రజలకు సాయం చేసేందుకు మొరాకో సాకర్‌ జట్టు ముందుకొచ్చింది. ఈ జట్టు సభ్యులు క్షతగాత్రుల కోసం రక్తదానం చేశారు.