1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (09:29 IST)

పాలస్తీనా ఎంబసీలో భారత రాయబారి అనుమానాస్పద మృతి

పాలస్తీనా దేశంలో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తూ వచ్చిన ముకుల్ ఆర్య అనుమానాస్పదంగా చనిపోయారు. ఆయన ఎంబసీలోనే విగతజీవిగా పడిపుండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 2008 బ్యాచ్‌కు చెందిన ముకుల్ ఆర్య ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో విద్యను అభ్యసించారు. 
 
ఆ తర్వాత ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కాబూల్, మాస్కాల్లోని భారత రాయబార కార్యాలయాలతోపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పని చేశారు. పారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో కూడా విధులు నిర్వహించారు. 
 
అలా ఉజ్వలమైన కెరీర్‌తో ముందుకుసాగుతూ వచ్చిన ముకుల్ ఆర్య ఉన్నట్టుండి విగతజీవిగా కనిపించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ధృవీకరించి, ఆయన మృతిపట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
 
ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని మహమ్మద్ ష్టాయేలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాగా, ముకుల్ ఆర్య భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.