శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఏప్రియల్ 2025 (19:28 IST)

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Shehbaz Sharif
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి చేసి 25 మంది భారత పర్యాటకులను హతం చేయడంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడులపై భారత్ దౌత్యపరంగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో ప్రధానంగా ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి, తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. భారత్ తీసుకున్న ద్వైపాక్షిక చర్యలపై పాక్ కూడా ధీటుగానే ప్రతిస్పందించింది. 
 
పాక్ భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన ఆ దేశ అత్యున్నత కమిటీ కొన్ని గంటల పాటు సమావేశమై తాజా పరిణామాలపై సుధీర్ఘంగా చర్చించింది. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన అధిపతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చర్యలన్నీ దాదాపుగా భారత్ తీసుకున్న చర్యలనే పాకిస్థాన్ కాపీ కొట్టింది. 
 
సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా తమ దేశంలో పర్యటిస్తున్న భారత జాతీయులకు అనుమతులతో పాటు ఇతర వీసాలను పాక్ రద్దు చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని భారత ప్రభుత్వం కూడా ఇదే తరహా నిర్ణయాన్ని బుధవారమే తీసుకుంది. భారత్‌లోని హైకమిషన్‌ కార్యాలయంలో సిబ్బందిని 30కి తగ్గించింది. భారత్ కూడా ఇదే చర్యలను ప్రకటించింది. అలాగే అటారీ సరిహద్దులను మూసివేయాలని భారత్ నిర్ణయించగా, పాకిస్థాన్ సైతం వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్టు ప్రకటించింది.

దీంతో పాటు పాక్ గగనతలంలోకి భారత్‌కు చెందిన విమానాలు గానీ, భారతీయ సంస్థలు నడుపుతున్న విమానాలు గానీ ప్రయాణించకుండా ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. కాగా, సౌదీ పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని స్వదేశానికి వచ్చిన ప్రధాని మోడీ విమానం పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించిన విషయం తెల్సిందే.