మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (17:00 IST)

ఉక్రెయిన్‌కు సాయం చేస్తామంటున్న భారత్

రష్యా దండయాత్ర కారణంగా తీవ్రంగా ధ్వంసమైన ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్ట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అదేసమయంలో ఉక్రెయిన్‌లో పరిస్థితులు నానాటికీ మరింతగా దిగజారిపోతున్నాయి. వీటిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌కు మరింత సాయాన్ని అందిస్తామని తెలిపింది. 
 
ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న మానవ సంక్షోభంపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించేందుకు పలు దేశాల విన్నపం మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. 
 
ఇందులో తిరుమూర్తి మాట్లాడుతూ, ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారని గుర్తుచేశారు. 
 
ఆ దేశంలోని మానవతా పరిస్థితులపై భారత్ ఆవేదన వ్యక్తం చేస్తుందని, ఉక్రెయిన్ ప్రజలకు మానవతా దృక్పథంతో సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమస్యను రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య దౌత్య విధానాలు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.