1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (08:56 IST)

ఉక్రెయిన్‌లో ఆగని రష్యా కాల్పులు... సామాన్య ప్రజలపై బాంబుల వర్షం

ఉక్రెయిన్‌ను ఆక్రమించేందుకు రష్యా కాల్పులు ఆగట్లేదు. రష్యన్ ఆర్మీ ప్రస్తుతం అపార్ట్‌మెంట్లు, ఇళ్లపై బాంబుల వర్షం కురిపిస్తోంది. బంకర్లపై మిసైళ్లు ప్రయోగిస్తోంది. దీంతో వేలాది మంది ప్రజలు.. అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
మరోవైపు.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను తిరస్కరిస్తున్నామని రష్యా స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమై 22 రోజులైనా కూడా యుక్రెయిన్‌పై భీకర దాడికి పాల్పడుతోంది రష్యా. సామాన్య ప్రజలే టార్గెట్‌గా బాంబులు, మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. నడి వీధుల్లో ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.
 
కేవలం సైనికులు, సైనిక స్థావరాలే అంటూ దండయాత్ర మొదలుపెట్టిన రష్యా.. ఇప్పుడు సామాన్యులే టార్గెట్‌గా విరుచుకుపడుతోంది. 
 
ఉక్రెయిన్‌ ఉత్తర ప్రాంతంలోని చెర్నిహివ్‌ పట్టణంలో బ్రెడ్‌ కోసం క్యూలో నిలబడి ఉన్న 13 మందిని రష్యా సైనికులు కాల్చి చంపారంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  
 
రష్యా దాడులకు నిత్యం వేల మంది అయిన వారికి దూరమవుతున్నారు. నగరాలను శిథిలం చేయడమే కాదు.. పెద్దఎత్తున ప్రజల ప్రాణాలను బలిగొంటోంది రష్యా.