1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (12:45 IST)

టీవీ చర్చలో రిషి సునక్ ముందంజ.. వెనుకబడిన లిజ్ ట్రస్

Rishi Sunak
బ్రిటన్‌ ప్రధాని ఎన్నిక కోసం జరుగుతోన్న రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఆయన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ కంటే వెనుకంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతోన్న వేళ.. ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 
 
తాజాగా జరిగిన కీలకమైన టీవీ డిబేట్‌లో ట్రస్‌పై రిషి సునక్ అనూహ్య విజయం సాధించారు. స్కై న్యూస్‌ నిర్వహించిన ‘బ్యాటిల్‌ ఫర్‌ నంబర్‌ 10’ టీవీ డిబేట్‌లో స్టూడియో ప్రేక్షకులు సునాక్‌కు మద్దతిచ్చారు.
 
ఈ టీవీ డిబేట్‌లో ప్రధాని పదవికి తాము ఎందుకు అర్హులమో ఇరువురు అభ్యర్థులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రిషి సునాక్‌ మాట్లాడుతూ.. 'పన్నుల తగ్గింపు కంటే ముందు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ద్రవ్యోల్బణం మరింత పెరిగితే మోర్టగేజ్‌ రేట్లు పెరుగుతాయి. మన సేవింగ్స్‌, పింఛన్లు అన్నీ ఆవిరవుతాయి' అని వివరించారు. 
 
అనంతరం లిజ్‌ ట్రస్‌ మాట్లాడుతూ.. అధిక పన్నుల వల్లే బ్రిటన్‌లో మాంద్యం భయాలు తలెత్తుతున్నాయని అన్నారు. దీనిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్‌ వాదనను సునాక్‌ తోసిపుచ్చారు. ద్రవ్యోల్బణం వల్లే మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఇరువురి వాదనలు పూర్తయిన తర్వాత స్టూడియోలోని ఆడియన్స్‌కు ఓటింగ్‌ పెట్టారు. ఇందులో ఎక్కువ మంది రిషి సునాక్‌కు మద్దతుగా ఓటువేశారు. ఈ టీవీ డిబేట్‌లో ఆయన విజయం సాధించనట్టు ప్రకటించారు.