1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (18:14 IST)

బిల్ గేట్స్ సంచలన నిర్ణయం.. యావత్ సంపదను సమాజానికే ఇస్తా!

Bill Gates
ధనవంతులు విరాళాలు ప్రకటించడం ఒక ఎత్తు. మరికొందరు సంపన్నులు డబ్బును ఆదా చేయడంలోనూ దృష్టి సారిస్తారు. డబ్బు సంపాదించడం.. ఆస్తులను కూడబెట్టడం సంపన్నుల నైజం. వీరిలో చాలామంది తమ ఆస్తులను ఇతరుల ఇవ్వడానికి మొగ్గు చూపరు. కానీ ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ మాత్రం డిఫరెంట్.
 
సామాజిక సేవా కార్యక్రమాల కోసం తాజాగా 20 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.60 లక్షల కోట్లు) విరాళం ప్రకటించిన ఆయన.. తన జీవనానికి, తన కుటుంబ సభ్యుల జీవనానికి కావాల్సింది పోను, మిగిలిన తన యావత్ సంపదను కూడా సమాజానికే ఇచ్చేస్తానని బిల్ గేట్స్ ప్రకటించారు.
 
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ ఐదో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ 103 బిలియన్ డాలర్లు (రూ.8.13 లక్షల కోట్లు). తన మాజీ భార్య మిలిందాతో కలసి ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో (భారత్ కూడా) ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన జీవనానికి అయ్యే ఖర్చుకు మిగులును సమాజానికే ఇచ్చేస్తానని తెలిపారు. ప్రస్తుతం ఏటా ఈ ఫౌండేషన్ తరఫున 6 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుండగా, 2026 నాటికి 9 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్నది ఆయన లక్ష్యమని తెలిపారు. 
 
"నేను ఇస్తున్న ఈ విరాళం త్యాగం కాదు. గొప్ప సవాళ్లను ఎదుర్కోవడంలో భాగస్వామ్యం అవుతున్నానని గర్వంగా ఉంది. నా వనరులను సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రపంచంలో గొప్ప సంపద కలిగిన ఇతరులు సైతం ఈ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను" అని బిల్ గేట్స్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు.