శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (12:45 IST)

భారతీయ రైల్వేకు జియో సేవలు... 1.95 లక్షల ఎయిర్‌టెల్ కనెక్షన్లు క్లోజ్

దేశంలో రిలయన్స్ జియో దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలు కుదేలైపోతున్నాయి. ఇప్పటికే భారీ మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయిన టెలికాం కంపెనీలు ఇపుడు తమ యూజర్లను కూడా కోల్పోతున్నాయి. 
 
ముఖ్యంగా, దేశీయ టెలికాం రంగంలోకి జియో ఎంట్రీతో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. ఆకాశంలో ఉన్న డెటా చార్జీలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. దీనికి కారణం రిలయన్స్ జియో. ఇతర సంస్థలు జియో పోటీని తట్టుకునేందుకు పోటాపోటీగా ఆఫర్లు మీద ఆఫర్లు కురిపిస్తున్నాయి.
 
ఇలా మొబైల్ నెట్‌వర్క్ రంగంలో రాకెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్న జియో.. ఇపుడు భారతీయ రైల్వేలో తన సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇందులోభాగంగా, 2019 జనవరి ఒకటో తేదీ నుంచి రైల్వే శాఖలో రిలయన్స్ జియో సేవలు ప్రారంభించనుంది. 
 
ఇప్పటివరకు రైల్వే శాఖ ఎయిర్‌టెల్ సేవలను వినియోగించుకుంటూ వచ్చింది. రైల్వేలో ఎయిర్‌‌టెల్ నెట్‌వర్క్ పరిధిలో సుమారు 1.95 లక్షల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లోజ్డ్ యూజర్ గ్రూపు (సీయూజీ) పరిధిలో ఉన్నాయి. ఇందుకోసం ఎయిర్‌టెల్‌కు రైల్వేశాఖ ఒక యేడాదికి రూ.100 కోట్ల మేరకు బిల్లు చెల్లిస్తోంది. 
 
ఇపుడు జియో రాకతో ఈ కనెక్షన్లన్నీ కట్ కానున్నాయి. ఫలితంగా ఎయిర్‌టెల్ ఆదాయంలో కూడా కోతపడనుంది. అదేసమయంలో జియో సర్వీసుల కారణంగా రైల్వే శాఖ బిల్లు ఒక్కసారిగా 35 శాతం మేరకు తగ్గనుంది.