శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2019 (09:15 IST)

కాసులకు కక్కుర్తి... టెలికాం కంపెనీల చీఫ్ ట్రిక్స్.. రింగ్ టైమ్ తగ్గించిన కంపెనీలు

దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఈ ఆధిపత్య పోరు ప్రభావం మొబైల్ వినియోగదారులు బలైపోతున్నారు. తాజాగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్లు కంపెనీలు చేసిన చిన్నపాటి ట్రిక్స్ కారణంగా వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 
 
ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఫీ (ఐయూసీ) విషయంలో రిలయన్స్ జియో - భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇందులోభాగంగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు అవుట్ గోయింగ్ కాల్స్ రింగ్ టైం వ్యవధిని 40 సెకన్ల నుంచి 25 సెకన్లకు తగ్గించాయి. 
 
ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్ మొత్తంలో రింగ్ వ్యవధిని తగ్గించగా, వొడాఫోన్ కొన్ని సర్కిళ్లలో మాత్రమే రింగ్ టైంను తగ్గించింది. ఎయిర్‌టెల్ నుంచి జియో, వొడాఫోన్ ఐడియాకు వెళ్లే అవుట్ గోయింగ్ కాల్స్ రింగ్ వ్యవధిని 25 సెకన్లకు తగ్గించినట్టు భారతీ ఎయిర్‌టెల్ అధికారికంగా ప్రకటించింది. 
 
అలాగే, వొడాఫోన్ ఐడియా కూడా రింగ్ వ్యవధిని తగ్గించినట్టు తెలిపింది. అదేవిధంగా రిలయన్స్ జియో కంపెనీ కూడా రింగ్ టైంను 20 సెకన్లకే తగ్గించింది. రింగ్ వ్యవధిని తక్కువ చేయడం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీయాలనే వ్యూహం అన్ని కంపెనీల్లో కనిపిస్తున్నాయి. 
 
ఈ కంపెనీలు అనుసరిస్తున్న విధానం వల్ల అంటే రింగ్‌ టైంను తగ్గించడం ద్వారా 25 సెకన్ల తర్వాత ఫోన్ ఆగిపోతుంది. ఫలితంగా అవతలి వ్యక్తి ఫోన్‌పై మిస్డ్ కాల్ పడుతుంది. దీంతో కాల్ బ్యాక్ వస్తుందని, దీనిని సొమ్ము చేసుకోవాలనే వ్యూహం ఇందులో దాగుందని ఆరోపిస్తున్నాయి. ఇది ఐయూసీని మానిప్యులేట్ చేయడమే అవుతుందని పేర్కొన్నాయి.