గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్

ట్వట్టర్‌లో కొనసాగుతున్న తీసివేతల పర్వం... భారత్‌లో 180 మందికి ఉద్వాసన

twitter
ట్విట్టర్‌లో తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఈ మైక్రో మెస్సేజింగ్ యాప్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కైవసం చేసుకున్నారు. ఆ వెంటనే ఆయన ఉన్నతాధికారులపై వేటు వేశారు. అదేసమయంలో ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌కు 7,500 మంది ఉద్యోగులు ఉండగా, ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ఆయన నడుం బిగించారు. 
 
ఇందులోభాగంగా, భారీగా తీసివేతలను చేపడుతున్నారు. ఒక్క భారత్‌లోనే దాదాపు 180 మందిపై వేటు వేశారు. మన దేశంలో 230 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 180 మందిని తొలగించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇంజనీరింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్, పాలసీ విభాగాలకు చెందిన ఉద్యోగులే అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే, ఇలా తొలగించిన వారికి ఏదేనా పరిహారం ఇస్తారా లేదా అన్నది తెలియాల్సివుంది. 
 
ఈ మేరకు ఎలాన్ మస్క్ నుంచి గురువారం ఉద్యోగులకు ఓ సందేశం వచ్చింది. ఉద్యోగులతో పాటు ట్విట్టర్ సిస్ట్, కస్టమర్ డేటా భద్రత దృష్ట్యా అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, ఒక వేళ మీరు ఆఫీసులో ఉన్నా, ఆఫీసుకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న దయచేసి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. ఆ సందేశం చూడగానే ఉద్యోగులంతా షాక్‌కు గురయ్యారు.