గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (17:40 IST)

యూట్యూబ్ రిపోర్టర్ల పరిస్థితి ఏంటి..?

జీ-మెయిల్ అకౌంట్ ఉంటే చాలు యూట్యూబ్‌లో న్యూస్ ఛానెల్ పెట్టేస్తున్న రోజులివి. వాట్సప్ గ్రూపుల్లో ఉద్యోగావకాశాలు అంటూ ప్రచారం చేసుకుని, ఊరికో విలేకరికి పోస్టింగ్ ఇచ్చేస్తున్న కాలం ఇది. 
 
సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే లోగో, ఐడీకార్డ్ వెంటనే ఇచ్చేస్తాం, ఫీల్డ్ మీద పడి దున్నేయండి అంటూ ప్రచారం చేసుకునేవారి కలెక్షన్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతున్న టైమ్ ఇది.
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో A-1 న్యూస్ నుంచి  Z-99 న్యూస్ వరకు ఏ ఒక్క అక్షరాన్నీ వదలకుండా ఛానెళ్లు పెట్టేశారంటే.. ఇన్నాళ్లూ ప్రభుత్వం సైలెంట్‌గా ఉండటమే దానికి కారణం. 
 
ఇప్పుడిక ప్రభుత్వం స్క్రూలు బిగించడం మొదలు పెట్టడంతో ఇలాంటి ఛానెళ్ల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. న్యూస్ ఛానెల్ రిపోర్టర్‌ని అంటూ ఐడీకార్డులు మెడలో వేసుకుని, వాహనాలపై ప్రెస్ అనే స్టిక్కర్ అతికించుకుని తిరిగే నకిలీ విలేకరులందరికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శరాఘాతమే.
 
ఎవరికి వారే ఛానెల్ ఓనర్లు, రిపోర్టర్లుగా మారి లోగోలు తీసుకుని ఉదయాన్నే బ్లాక్ మెయిలింగ్‌కి బయలుదేరే బ్యాచ్‌కి ఇక గడ్డురోజులే. నాయకుడు ప్రెస్‌మీట్ పెడితే ముందు కనిపించే టేబుల్ మొత్తం లోగోలతో నిండిపోతున్న రోజులు క్రమక్రమంగా మారిపోబోతున్నాయి. 
 
ఓటీటీల పేరుతో యూట్యూబ్ ఛానెళ్లపై కూడా కేంద్రం నిఘా పెట్టడంతో ఇకపై ఎవరికి వారు యూట్యూబ్ న్యూస్ అంటూ హడావిడి చేయడం తగ్గిపోతుంది.
 
ఇప్పటికే యూట్యూబ్‌లో ఉన్న న్యూస్ ఛానెళ్లని కేంద్రం క్రమబద్ధీకరించడంతో పాటు కొత్తగా న్యూస్ ఛానెల్ అనేవారికి కూడా సవాలక్ష కండిషన్లు విధించబోతోంది. ఎవరికి వారు లోగోలు తీసుకుని బైటకి రావడం ఇకపై చూడలేం. ఇప్పటికే ప్రభుత్వం అక్రిడిటేషన్ల విధానంతో వడపోత మొదలు పెట్టాలనుకున్నా దాన్ని అడుగడుగునా కొంతమంది అడ్డుకుంటున్నారు. 
 
విలేకరులకు కనీస విద్యార్హత నిబంధన పెట్టాలని వైసీపీ ప్రభుత్వం చేసిన ఆలోచన కూడా అలాగే ఆగిపోయింది. సోషల్ మీడియా ఛానెళ్లకు కూడా అక్రిడిటేషన్ ఇవ్వాలంటూ వచ్చిపడుతున్న వేలాది అప్లికేషన్లను ఫైనలైజ్ చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. దీనిపై కోర్టు కేసులు కూడా నమోదయ్యాయి.
 
న్యూ మీడియాని మీరెందుకు గుర్తించరంటూ యూట్యూబ్, సోషల్ మీడియా ఛానెళ్ల నిర్వాహకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇకపై ఇలాంటి వాటిపై కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో మూడు సార్లు వాయిదాపడిన జర్నలిస్ట్ అక్రిడిటేషన్ల వ్యవహారం కూడా ఓ కొలిక్కి వస్తుంది.
 
 దసరా మామూళ్ల స్థాయికి కూడా దిగజారిపోయిన యూట్యూబ్ జర్నలిజానికి నిజంగా కత్తెర పడాల్సిన సమయం ఇదే? సరైన టైమ్‌లో కేంద్రం తీసుకున్న నిర్ణయం అటు ఓటీటీ ప్లాట్ ఫామ్‌కి సెన్సార్ వేయడంతో పాటు ఇటు యూట్యూబ్ ఛానెళ్ల ఆగడాలని కూడా అడ్డుకట్ట వేస్తుందనడంలో సందేహం లేదు.