గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (15:22 IST)

హసీనా నుంచి బెంగాలీ స్వీట్లు... దీదీ నుంచి కుర్తాలు వస్తాయి : నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఆయన అనేక విషయాలు వెల్లడించారు. తనకు ప్రతిపక్ష పార్టీల్లో చాలా మంది మిత్రులు ఉన్నారని చెప్పారు. అలాగే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నుంచి తనకు బెంగాలీ స్వీట్లు, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి తనకు రెండు కుర్తీలు వస్తాయని వెల్లడించారు. 
 
ఏఎన్ఐ వార్తా పత్రిక కోసం ప్రధాని నరేంద్ర మోడీని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతోమంది ప్రతిపక్ష పార్టీల నాయకులతో తాను సుహృద్భావ సంబంధాలు కలిగి ఉన్నానని తెలిపారు. 
 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు ప్రతిపక్ష పార్టీలలో తనకు పలువురు మిత్రులున్నారని చెప్పారు. మమతా బెనర్జీ తనకు ఏటా ఒకటి రెండు కుర్తాలు పంపుతుంటారని తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బెంగాలీ మిఠాయిలు తనకు పంపుతారని, ఈ విషయం తెలుసుకున్న మమతా దీదీ కూడా తనకు బెంగాలీ స్వీట్లు పంపడం ప్రారంభించారు అని మోడీ వెల్లడించారు. 
 
కుటుంబంతో ఉండలేకపోతున్నందుకు చింతిస్తున్నారా అన్న ప్రశ్నకు ప్రధాని బదులిస్తూ, తాను యువకునిగా ఉన్నప్పుడే కుటుంబానికి దూరమయ్యానని చెప్పారు. చిన్న వయస్సులోనే కుటుంబాన్ని వీడినందున నేను ఒంటరి జీవితం జీవించాను. జీవితంలో ఒక దశలో వచ్చిన తర్వాత కుటుంబాన్ని వీడటం కష్టంగా ఉంటుంది. కానీ నేను ప్రస్తుత జీవితానికి అలవాటు పడ్డా అని మోడీ వెల్లడించారు.
 
ఇప్పటివరకు జరిగిన మూడు దశల ఎన్నికల పోలింగ్ తర్వాత తాము ఓడిపోతామనే విషయం విపక్ష పార్టీలకు తెలిసిపోయిందనీ, అందుకే ఈవీఎంల పనితీరు సరిగా లేదని సరికొత్త పాటను అందుకున్నాయని చెప్పారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి తన వైఫల్యానికి కుంటిసాకులు చెప్పినట్టుగానే ప్రతిపక్షాలు తమ ఆగ్రహాన్ని ఈవీఎంలపైన, ఓటింగ్‌పైనా చూపిస్తున్నాయని నరేంద్ర మోడీ విమర్శించారు.