1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (11:01 IST)

మోడీ శరీరం మొత్తం ప్రజల రక్తంతో తడిసిపోయింది : మమతా బెనర్జీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించాల్సింది పోయి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని అవినీతిపరుడని అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ శరీరం మొత్తం ప్రజల రక్తంతో తడిసిపోయిందని దుయ్యబట్టారు. 
 
పురులియా లోక్‌సభ స్థానం పరిధిలోని రఘునాథ్‌పుర్‌, బంకురా పరిధి బర్జోరాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, మొన్న రాజీవ్‌ను నంబర్ వన్ అవినీతి పరుడని అన్నారని, తననేమో వసూళ్లకు పాల్పడేదానినని అంటున్నారన్నారు. మరి ఆయననేమనాలని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించాల్సింది పోయి రాజీవ్‌ను అవినీతిపరుడని అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ శరీరం మొత్తం ప్రజల రక్తంతో తడిసిపోయిందని దుయ్యబట్టారు. 
 
తాను చాలామంది ప్రధానులను చూశానని, కానీ మోదీ అంత అబద్ధాలకోరును ఎప్పుడూ చూడలేదన్నారు. ఆయన మళ్లీ ఎన్నికైతే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుందన్నారు. చరిత్రను, భౌగోళికతను, రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారని ఆరోపించారు. మోదీకి ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపించాల్సిన అవసరముందని మమత పేర్కొన్నారు.
 
అంతేకాకుండా, ఆరెస్సెస్ వాళ్లు ఏనాడూ స్వాతంత్ర్యం కోసం పోరాడలేదని, పైగా బ్రిటీష్ వాళ్లకు మద్దతుగా నిలిచారని విమర్శించారు. దేశాన్ని కాదని బ్రిటీష్ వాళ్లకు మద్దతుగా నిలిచినందుకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్‌లో దుర్గా పూజాను, హిందూ ఆచారాలను మమతాబెనర్జీ అనుమతించడం లేదని ఇటీవల ప్రధాని మోడీ ఆరోపించారని, ఈ ఆరోపణలను మీరు నమ్ముతారా? అని ప్రజలను ప్రశ్నించారు. 
 
ప్రజలు జైశ్రీరాం అంటే జైళ్లో పెడుతున్నారని ప్రధాని చేసిన ఆరోపణలను కూడా తిప్పికొట్టారు. నేను వాళ్లలాగా జైశ్రీరాం అనను. దానికి బదులు జై హింద్ అని అంటాను అని చెప్పారు. ఐదేండ్లు అధికారంలో ఉన్నా అయోధ్యలో చిన్న రామాలయాన్ని కూడా నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తామని పేర్కొన్నారు.