1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (10:47 IST)

వ్యాక్సినేషన్ ద్వారా భారత్ శక్తి ఏంటో చూపించాం : ప్రధాని మోడీ

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భార‌త్ 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వినియోగించిన దేశంగా నిలిచింది. 
 
దీన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించారు. 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకోవడం దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయమ‌న్నారు. భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ద్వారా దేశ శ‌క్తి ఏంటో ప్ర‌పంచానికి చూపించామ‌ని చెప్పారు.
 
క‌ఠిన‌మైన ల‌క్ష్యాలను దేశం విజయవంతంగా చేరుకోగ‌ల‌ద‌ని చెప్ప‌డానికి ఇదొక నిదర్శనమన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా టీకాలు అందించామ‌న్నారు. భారత్‌లో వ్యాక్సినేషన్ శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి కొన‌సాగింద‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ ఇప్ప‌టికీ క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందేన‌ని తెలిపారు.
 
బయటకు వెళ్లినప్పుడు చెప్పులు ఎలా వేసుకుంటామో, అంతే సాధార‌ణంగా మాస్క్ కూడా ధ‌రించాల‌ని కోరారు. దేశ‌ ఆర్థిక వ్యవస్థ పట్ల దేశీయ నిపుణ‌ల‌తో పాటు విదేశీ నిపుణులు కూడా చాలా సానుకూలంగా ఉన్నారన్నారు. ఇప్పుడు దేశానికి భారీగా పెట్టుబడులు వ‌స్తున్నాయ‌ని గుర్తు చేసిన ఆయన... దేశ‌ యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయ‌ని చెప్పుకొచ్చారు.