శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (08:53 IST)

ప్రణబ్ లక్కీ నంబర్ ఏంటి? .. సొంతూరిలోని ఆ పండు అంటే అమితమైన ఇష్టం...!

అనారోగ్యం కారణంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 84 యేళ్ల వయసులో కన్నుమూశారు. ఐదు దశాబ్దాలుగా పైగా ఆయన దేశానికి సేవలు చేసి, భరతమాత ముద్దుబిడ్డగా గుర్తింపుపొందారు. పక్కా కాంగ్రెస్ వాది అయినప్పటికీ.. దేశంలో ఆజాతశత్రువుగా పేరుగడించారు. ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. దేశ రాజకీయాల్లో సైతం ట్రబుల్ షూటర్‌గా ఖ్యాతికెక్కారు. అలాంటి ప్రణబ్ ముఖర్జీకికి కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఆయన లక్కీ నంబర్ 13 అయితే, అమితంగా ఇష్టపడే పండ్లు మిరాటీ పనస పండ్లు. 
 
ప్రణబ్‌ ముఖర్జీ అదృష్ట సంఖ్య 13. ఈ సంఖ్యతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ప్రణబ్‌కు వివాహమైంది 1957 జూలై 13న. లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికైంది 2004 మే 13న. ఆయన అప్పట్లో నివసించింది తల్కతొరా రోడ్డులోని 13వ నంబరు ఇంట్లోనే. యూపీఏ హయాంలో ప్రణబ్‌కు పార్లమెంటు 13వ నంబరు గదిలోనే కార్యాలయం ఉండేది. భారత 13వ రాష్ట్రపతిగా ఆయన ఎన్నిక కావడం విశేషం. ఇలా అనేక విషయాల్లో ఆయనకు 13 నంబరుకు విడదీయలేని బంధం ఉంది. 
 
ఇకపోతే, ప్రణబ్‌కు సొంతూరు మిరాటీపై ఉన్న మమకారానికి నిదర్శనం ఈ ఘటన. చికిత్సకు తీసుకెళ్లడానికి ముందు ఆయన తన కుమారుడిని పిలిపించి.. మిరాటీ నుంచి కొన్ని పనసపండ్లు తీసుకురమ్మన్నారు. దీంతో మిరాటీ నుంచి ఆగస్టు 3న అభిజిత్‌ తెచ్చిన పనసపండ్లను ప్రణబ్‌ రుచిచూశారు. ఆయనకు ఇష్టమైన ఫలాల్లో పనసపండు ఒకటని ఆయన సన్నిహితులు అంటారు.