సోమవారం, 30 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (10:39 IST)

మైసూర్ శివారులో రేవ్ పార్టీ.. సీఎం సిద్ధరామయ్య సీరియస్...

rave party
కర్నాటక రాష్ట్రంలోని మైసూర్ శివారు ప్రాంతంలో కొందరు యువతీయువకులు రేవ్ పార్టీని జరుపుకున్నారు. ఇందులో పాల్గొన్న వారిలో 15 మంది యువతులు అపస్మారకస్థితిలో ఉన్నారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపురం సమీపంలోని ఓ ప్రైవేట్ ఫాం హౌస్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రేవ్ పార్టీలో వాడిన మందులు, డ్రగ్స్‌ శాంపిల్స్‌నుసేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. పోలీసులు అదుపులో ఉన్నవారికి రక్త పరీక్షలు నిర్వహించారు. దాడి సందర్భంగా 15 మందికిపైగా యువతులు అపస్మారకస్థితిలో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
 
కాగా, ఈ రేవ్ పార్టీ వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటారని తెలిపారు. పార్టీలో డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించినట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. పార్టీలో పెద్ద ఎత్తున మద్యం, సిగరెట్లు ఉపయోగించారని, పార్టీకి హాజరైన వారి నుంచి రక్తం శాంపిల్స్ కూడా సేకరించామని, రిపోర్టుల కోసం వేచిచూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ రేవ్ పార్టీకి సంబంధించిన నిర్వాహకులతో పాటు ఇందులో పాల్గొన్నవారిలో దాదాపు 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.