గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (16:22 IST)

ఉత్తర సిక్కింలో ఘోరం.. లోయలో పడిన ఆర్మీ ట్రక్కు - 16 మంది మృతి

army truck accident
ఇండోచైనా సరిహద్దు ప్రాంతమైన ఉత్తర సిక్కింలో శుక్రవారం ఘోరం జరిగింది. భారత ఆర్మీకి చెందిన ట్రక్కు వాహనం ఒకటి చాలా లోతైన లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది సైనికులు ప్రాణాలతో చనిపోయారు. మరో నలుగురు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు 130 కిలోమీటర్ల దూరంలో, లాచెన్‌కు 15 కిలోమీటర్లలో ఉన్న జెమా 3 వద్ద శుక్రవారం ఉదయం 8 గంటలకు జరిగింది. 
 
దీనిపై ఇండియన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారులు స్పందిస్తూ, ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆర్మీ జవాన్లు సేవలు వారి నిబద్ధతకు దేశం ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతుంది. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.