శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (17:47 IST)

ఆయిల్ ఇండియా లిమిటెడ్ చమురు బావిలో మంటలు.. ఇద్దరు మృతి

అస్సోం ఆయిల్ ఇండియా లిమిటెడ్ చమురు బావిలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. 50కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. తీన్‌సుకియా జిల్లా బాగ్‌జాన్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, మంటలను అదుపు చేసేందుకు ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
 
వివరాల్లోకి వెళితే.. చమురు బావిలో భారీ ఎత్తున మంటలు చెలరేగి సుమారు 30 కిలోమీటర్ల వరకూ దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా, మంటల్లో మృతిచెందిన వారిని కంపెనీ ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ఆపరేటర్లు దుర్లోవ్ గొగోయ్, తికేశ్వర్ గొహైన్‌గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.
 
ఓఎన్‌జీసీకి చెందిన అగ్నిమాక సిబ్బంది ఒకరు కూడా మంటలను అదుపు చేసే క్రమంలో స్వల్పంగా గాయపడ్డారు. అగ్నికీలలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు అసోం ప్రభుత్వం తెలిపింది. పరిస్థితి ప్రస్తుతం ఇంకా అదుపులోకి రాలేదని, ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కేంద్ర మంత్రులతో మాట్లాడారని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పరిమల్ శుక్లాబైద్య తెలిపారు.