శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 9 ఫిబ్రవరి 2023 (17:51 IST)

జమ్మూ కాశ్మీర్‌లో రోజుకి 50 కుక్కకాటు కేసులు, పెరుగుతున్న కుక్కల సామ్రాజ్యం

Dogs
జమ్మూ కాశ్మీర్‌లోనే కాదు, ఇప్పుడు లడఖ్‌లోని మంచు ఎడారిలో కూడా కుక్కల సామ్రాజ్యం నిజంగా షాకింగ్. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే అధికారిక లెక్కల ప్రకారం, జమ్మూ కాశ్మీర్‌లో ప్రతిరోజూ 50 కుక్కకాటు కేసులు వస్తున్నాయి. ఇప్పుడు లడఖ్‌లో కూడా రోజుకు 7 కేసులు చొప్పున నమోదవుతున్నాయి. జనవరి 2019 నుండి జూలై 2022 వరకు కేవలం మూడున్నరేళ్లలో కాశ్మీర్‌లో 65 వేల కుక్కకాటు కేసులు నమోదయ్యాయంటే కుక్కల విజృంభణ ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు.
 
రాష్ట్రంలో అత్యధికంగా కుక్కకాటు కేసులు రాజధాని నగరం శ్రీనగర్‌లో నమోదవుతున్నాయి. 'సార్, కాశ్మీర్‌లో ఇప్పుడు నాకు కుక్కకాటు అంటే భయం, ఉగ్రవాదులంటే కాదు' అని పర్యాటకులు చాలాసార్లు చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. కుక్క కాటు నుంచి విముక్తి కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలలో అంటే 2013 సంవత్సరం నుండి ఇప్పటి వరకు లడఖ్‌లో 22,145 కుక్కలకు స్టెరిలైజ్ చేశారు. శ్రీనగర్‌లో కూడా రోజూ 50 నుంచి 60 వేసెక్టమీ చేయిస్తున్నా నిధుల లేమితో అవి సరిపోవడంలేదు.
 
Dogs
తమాషా ఏంటంటే.. జమ్మూ నగరంలో మొత్తం 40 వేల కుక్కల్లో 30 వేలకు స్టెరిలైజ్ చేశామని, ఇప్పటికీ కుక్కకాటు కేసులు తగ్గడం లేదని జమ్మూ మున్సిపాలిటీ పేర్కొంది. కుక్కకాటుకు, స్టెరిలైజేషన్‌కు సంబంధం ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. నిజానికి జమ్మూ మునిసిపల్ అధికారుల వాదన ఏమిటంటే, కుక్కలకు స్టెరిలైజ్ చేస్తే, అవి దూకుడుగా ఉండవట. కుక్కలు కరవవట. కానీ పెరుగుతున్న గణాంకాలు చూస్తే వాళ్ల వాదనలో పస లేదని తేలుతోంది. మొత్తమ్మీద కాశ్మీరు లోయ అందాలను చూసేందుకు వెళ్లేవారికి కుక్కల దండు విపరీతంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.