1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

నకిలీ పత్రాలు సృష్టి - మోసం కేసులో 383 యేళ్ల జైలుశిక్ష .. ఎక్కడ?

jail
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చేరన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌లో జరిగిన ఓ మోసంతో నకిలీ పత్రాల మోసం కేసులో దోషిగా తేలిన ఆ సంస్థకు చెందిన ఓ వ్యక్తికి కోర్టు 383 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, రూ.3.32 కోట్ల జరిమానా విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ రవాణా సంస్థ కోయంబత్తూరు డివిజన్‌లో బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ గత 1988లో నవంబరు ఎనిమిదో తేదీన ఒక కేసు నమోదైంది. 
 
నకిలీ పత్రాలతో 47 బస్సులను విక్రయించి రూ.28 లక్షల మోసం చేశారంటూ ఎనిమిది మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోదండపాణి, రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైస్వామి, రంగనాథన్, రాజేంద్రన్‌లను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో కోర్టులో విచారణ సాగుతూ వస్తుంది. ఈ క్రమంలో కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నటరాజన్, రామచంద్రన్, రంగనాథన్, రాజేంద్రన్‌లు చనిపోయారు.
 
మరోవైపు జీవించివున్నవారిలో కోదండపాణి మినహా మిగిలిన ముగ్గురినీ జడ్జి నిర్దోషులుగా పేర్కొనగా, ఆర్టీసీ సంస్థను మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాల కింద నాలుగేళ్ల చొప్పున 188 యేళ్లు, 47 ఫోర్జరీ నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 యేళ్ళు ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. ఈ మూడు శిక్షలను కలిపితే మొత్తం 383 సంపత్సరాల శిక్ష అవుతుంది. ప్రస్తుతం కోదండపాణి వయసు 82 సంవత్సరాలు. కోర్టు తీర్పు నేపథ్యంలో ముద్దాయిని పోలీసులు జైలుకు తరలించారు.