1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (22:36 IST)

ఉక్రెయిన్‌లోని భారతీయుల కోసం సీ-17 విమానాలు

ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య భీకరయుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. క్షిపణిదాడులకు తెగబడుతున్నాయి. మరోవైపు రష్యా సైన్య ఉక్రెయిన్‌ ప్రజలపై విచరక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లోని ఇతర దేశాలకు చెందిన ప్రజలు తమతమ దేశాలకు తరలిపోతున్నారు.
 
ఈ క్రమంలోనే భారత పౌరులు, విద్యార్థులు స్వదేశానికి చేరుకునేందుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులకు తరలివెళుతున్నారు. వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతుంది. 
 
అయితే, ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దీంతో భారత వాయుసేనను రంగంలోకి దించాలని ప్రధాని నరేంద్ర మోడీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా, సీ-17 విమానాల ద్వారా వారిని త్వరితగతిన స్వదేశానికి తీసుకుని రావాలని కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ రక్షణ శాఖకు కీలక ఆదేశాలు జారీచేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకునిపోయిన భారత పౌరులతోపాటు విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు వాయుసేనను రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించారు. విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ పౌరులను స్వదేశానికి తరలించేందుకు సీ-17 విమానాలను పంపేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.