1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (07:46 IST)

నమ్మి వచ్చిన ప్రియురాలిని ప్రియుడే కాపాడాలి : అలహాబాద్ హైకోర్టు

తల్లిదండ్రులను కాదనుకుని తనను నమ్మి వెంట వచ్చిన ప్రియురాలి గౌరవ మర్యాదలతో పాటు.. ఆమెను రక్షించాల్సింది ప్రియుడేనని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సామూహిక అత్యాచారం కేసులో బాధితురాలి ప్రియుడు వేసిన బెయిల్‌ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. నిందితుడికి బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. 
 
గత ఫిబ్రవరి 19న ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాకు చెందిన 15ఏళ్ల బాధితురాలు కుట్టుమిషన్‌ నేర్చుకోవడానికి ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లి.. అక్కడి నుంచి సమీపంలోని చెరువు వద్దకు చేరుకొని తన ప్రియుడు రాజును కలుసుకుంది. కొంత సమయానికి మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి రాజుని బంధించి.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
మరుసటి రోజు బాధితురాలు అకిల్‌సారాయ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రాజుతోసహా నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుతో కాగా.. తనకు సంబంధం లేదని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని రాజు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. 
 
దీనిపై విచారణ సందర్భంగా ధర్మాసనం 'ప్రియురాలిని కాపాడాల్సిన బాధ్యత ప్రియుడికి ఉంది. కానీ, తన ముందే ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడుతుంటే ఏ మాత్రం కాపాడే ప్రయత్నం చేయకుండా నిందితుడు ప్రేక్షక పాత్ర వహించాడు. అతడి వ్యవహారశైలి సందేహాత్మకంగా ఉంది. అలాగే.. మిగతా నిందితులతో అతడికి సంబంధాలు ఉన్నాయా.. లేదా అని ఖచ్చితంగా చెప్పలేం' అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 
 
నిందితుడు రాజుకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణలో భాగంగానే అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మేజర్‌ అమ్మాయితో పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది నేరం కాదని తెలిపింది. అయితే, ఈ చర్యను భారతీయ సమాజంలో అనైతిక చర్యగా పరిగణిస్తారని పేర్కొంది.