1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (11:14 IST)

కమలం గూటికి ఆనంద్ శర్మ? పుకార్లేనంటున్న కాంగ్రెస్ నేత!

anand sharma
దేశంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతోంది. దీంతో ఆ పార్టీకి చెందిన దిగ్గజ నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాషాయం పార్టీలో చేరిపోయారు. తాజాగా మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా కమలం గూటికి వెళ్ళనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఆయన తాజాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. దీంతో ఆనంద్ శర్మ ఇక కమలం పార్టీలో చేరడమే మిగిలివుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా మరికొన్ని నెలల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్ శర్మ, జేపీ నడ్డాల మధ్య జరిగిన భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 
 
మరోవైపు, తాను పార్టీ మారుతున్నట్టు సాగుతున్న ప్రచారాన్ని ఆనంద్ శర్మ ఖండించారు. ఎప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీ వాదినేనని చెప్పారు. పైగా, జేపీ నడ్డాను కలవడం తన హక్కు అని, తామిద్దరం ఒకే రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నామని గుర్తుచేశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి దూరమైపోతున్నారు.