శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 19 జనవరి 2019 (16:28 IST)

లోక్‌పాల్ కోసం మళ్లీ నిరాహారదీక్ష : అన్నా హజారే ప్రకటన

లోక్‌పాల్ నియామకం కోసం ఈనెల 30వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేయనున్నట్టు ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే ప్రకటించారు. తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతోంది. 
 
ఇందులో అన్నా హజారే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌పాల్‌, లోకాయుక్త 2013లో తయారైంది. 2014లో చట్టరూపం దాల్చింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రకటించారని గుర్తుచేశారు. 
 
కానీ, అదే యేడాదిలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎంతో కొంత దీనిపై ముందడుగు పడుతుందని ఆశించాం. కానీ గడిచిన ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు. అధికారం చేపట్టి ఇంతవరకూ లోక్‌పాల్‌ను నియమించలేదు. ఇందుకు నిరసనగా తాను ఈ నెల 30వ తేదీ నుంచి తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. 
 
ఆ తర్వాత హెచ్‌ఐసీసీ సదస్సులో మాట్లాడుతూ, ఒక యేడాది, ఐదేళ్లు, పదేళ్లు ప్రాతిపదికగా లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్భుతాలు సృష్టించాలని కోరారు. జీవింతలో సాధించాల్సిన లక్ష్యాలపై ముందే స్పష్టత ఉండాలన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దన్నారు. నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కూడా యువతలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.