1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (09:32 IST)

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి.. యాపిల్ తోటలో కశ్మీరీ పండిట్‌పై కాల్పులు, ఒకరు మృతి

జమ్మూకాశ్మీర్‌లో బస్సు బోల్తాపడిన ఘటనలో ఆరుగురు జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు చెలరేగిపోయారు. ఇద్దరు కశ్మీరీ పండిట్ సోదరులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
కశ్మీరీ పండిట్ కాల్చివేత ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు ఉగ్రవాదుల లక్షిత దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 21కి పెరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. సోఫియా జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకున్న అల్ బదర్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు యాపిల్ తోటలోకి వెళ్లి అక్కడ పనిచేస్తున్న కూలీలలో సునీల్ కుమార్ భట్, అతడి సోదరుడు (కజిన్) ప్రతంబర్ కుమార్ భట్‌లను కశ్మీరీ పండింట్లగా గుర్తించారు.
 
తర్వాత వారిని పక్కకు తీసుకెళ్లారు. వారిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనను ఓ ఉగ్రవాది తన సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీల్ కుమార్ ప్రాణాలు కోల్పోగా, ప్రితంబర్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.