గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సబబే : ఢిల్లీ హైకోర్టు

arvind kejriwal
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‌ను సీబీఐ అరెస్టు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. నూతన మద్యం పాలసీ విధానం రూపకల్పనలో చోటు చేసుకున్న అవకతవకలపై సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అయితే, ఆయన తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి.. ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. సరైన కారణం లేకుండా అరెస్టు జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. బెయిల్‌ కోసం చేసుకున్న దరఖాస్తునూ కొట్టి వేసింది. 
 
అయితే, బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై తొలుత కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేసింది. ఈ కేసులో ఊరట లభించినప్పటికీ.. మద్యం విధానంలో అక్రమాలపై కేసు నమోదు చేసిన సీబీఐ.. తీహార్ జైల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో జులై 12వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరైనప్పటికీ.. సీబీఐ కేసు కారణంగా ఆయన ప్రస్తుతం కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.