1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (22:24 IST)

నేను చనిపోలేదు.. బతికేవున్నాను... మృతి చెందాడని శవాల ట్రక్కులో ఎక్కించిన యువకుడి ఆర్తనాదం

coromandel tragedy
ఒడిశాలోని బాలాసోర్‍‌ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం దుర్ఘటన ఎందరో జివితాల్లో విషాదం నింపింది. ఇప్పటికీ, కొంతమంది తమ కుటుంబసభ్యుల ఆచూకీ కోసం మార్చురీలో గాలిస్తున్న దృశ్యాలు స్థానికులను కలిచివేస్తున్నాయి. ప్రమాదం జరిగిన రోజు పశ్చిమబంగాల్‌‌కు చెందిన బిశ్వజిత్‌ మాలిక్‌ కూడా షాలిమర్‌ స్టేషన్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. బాలాసోర్‌ ప్రాంతంలో రైలు ప్రమాదానికి గురైంది. 
 
బిశ్వజిత్‌ కుడి చేతికి తీవ్ర గాయం కావడంతో ఎటూ కదలేకపోయాడు. అంతలో కొంత మంది రైలులో చిక్కుకుపోయిన వారిని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు గాయం బాధిస్తున్నా.. శక్తినంతా కూడదీసుకుని రైలు నుంచి బయటపడ్డాడు. ఓ వైపు తోటి ప్రయాణికుల ఆర్తనాదాలు.. అంబులెన్సుల సైరన్‌లతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయిందని చెప్పాడు. 
 
బిశ్వజిత్‌ది ఎటూ కదల్లేని పరిస్థితి. సహాయం కోసం పిలుద్దామన్నా నోట్లోంచి మాట రావడంలేదు. చుట్టుపక్కల చూసేందుకు ప్రయత్నిస్తున్నా సాధ్యంకాలేదు. కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చింది. తన జేబులో ఉన్న ఫోన్‌ మోగుతున్నట్లు అనిపించింది. లేచిచూస్తే.. తనకి రెండు వైపులా కొంతమంది అచేతనంగా పడి ఉన్నారు. 
 
అప్పుడు అర్థమైంది బిశ్వజిత్‌కు.. తను కూడా చనిపోయానని భావించి, మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన లారీలో ఎక్కించారని. వెంటనే అక్కడున్న వారికి తాను బతికే ఉన్నానని తెలిసేలా తన ఎడమచేతిని పైకెత్తాడు. అది గమనించిన సహాయక సిబ్బంది.. బిశ్వజిత్‌ను చికిత్స కోసం గోపాల్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. 
 
తర్వాత తన తండ్రికి ఫోన్‌లో పరిస్థితి వివరించడంతో, ఆయన గోపాల్‌పూర్‌ ఆస్పత్రికి చేరుకుని బిశ్వజిత్‌ను కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎమ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బిశ్వజిత్ పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఒకవేళ తనకు మెలకువ రాకపోతే చనిపోయిన వారితోపాటు తనను కూడా తరలించేవారని, దేవుడి దయతో బతికి భయపడ్డానని బిశ్వజిత్‌ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పాడు.