గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (11:31 IST)

మనిషి రక్తం మరిగిన పెద్దపులి.. కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు

కర్నాటక రాష్ట్రంలోని బండీపుర అడవుల్లో ఓ పెద్దపులి మనిషి రక్తాన్ని మరిగింది. బండీపుర అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఈ పెద్దపులి దెబ్బకు ఆ ప్రాంత వాసులంతా ప్రాణభయంతో వణికిపోతున్నారు. దీంతో ఈ పెద్దపులిని కనిపిస్తే కాల్చివేయాల్సిందిగా అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. 
 
బండీపుర అభయారణ్యం పరిసరాల్లో ఓ పులి సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తుచేశారు. ఈ పులి కంటపడిన వారిలో ఏ ఒక్కరూ తిరిగి ప్రాణాలతో ఉండటం లేదు. దీంతో గ్రామస్థులకు కునుకులేకుండా పోయింది. 
 
తాజాగా మంగళవారం చామరాజనగర్ పరిధిలోని గుండ్లుపేట సమీపంలో ఉన్న చౌడహళ్లి వద్ద పశువులను మేపేందుకు వెళ్లిన రైతుపై దాడి చేసిన పులి, అతన్ని హతమార్చింది. ఆపై బుధవారం నాడు ఓ ఆవును చంపి తినేసింది. ఈ పులిని తక్షణం హతమార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కర్ణాటక అటవీ శాఖ అధికారులు, ఈ పులి కనిపిస్తే కాల్చి వేయాలన్న ఆదేశాలను జారీ చేశారు.