1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (16:04 IST)

మంచం కింద దాక్కొని భార్య ప్రియుడుని హత్య చేసిన భర్త!

కట్టుకున్న భార్య తనను మోసం చేసి ప్రియుడుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్టు భర్త కనిపెట్టాడు. దీంతో అతన్ని ఎలాగైనా చంపాలన్న నిర్ణయానికి వచ్చి మంచం కింద ఆరు గంటల పాటు దాక్కొని తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేశాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని పశ్చిమ బెంగుళూరులోని ఆండ్రహల్లిలో జరిగింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది సంవత్సరాల క్రితం హోసహల్లి తాండాకు చెందిన వినుతను భరత్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ నెలమంగళ సమీపంలోని ఓ కర్మాగారంలో పనిచేసేవారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
 
హోసహల్లి తాండాకు చెందిన శివరాజ్ ఉద్యోగం కోసం మూడేళ్ల క్రితం ఆమె ఇంటికి వెళ్లి వారం రోజులు అక్కడే ఉన్నాడు. శివురాజ్ కోసం వినుత ఉద్యోగం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో శివరాజ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీనిని ఆమె నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
ఈ విషయం భర్త భరత్‌కి తెలిసి భార్యను నిలదీశాడు. దీంతో ఆమె అతడిని విడిచిపెట్టి ఆంధ్రహళ్లిలో ఒంటరిగా బతుకుతోంది. అక్కడికి శివరాజ్ వారానికి ఒకటి లేదా రెండుసార్లు వచ్చి వెళుతుండేవాడు. అయితే తన కుటుంబాన్ని నాశనం చేసినందుకు భరత్ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసం శివరాజ్‌ను చంపడానికి పథకం వేశాడు.
 
బుధవారం రాత్రి వినుత చికెన్ కోసం బయటికి వెళ్లగా భరత్ ఎవరు చూడకముందు ఆమె ఇంట్లోకి ప్రవేశించి మంచం కింద ఆరు గంటల పాటు దాక్కున్నాడు. అనంతరం తెల్లవారుజామున ఆమె బాత్ రూంకి వెళ్లడం గమనించి తలుపు బిగించాడు. 
 
అనంతరం మంచంపై పడుకున్న శివరాజ్‌ను కత్తితో విచక్షణ రహితంగా కడుపులో పొడిచాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి భరత్‌ను అరెస్టు చేశారు.