శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (16:50 IST)

'స్వీట్' వెల్‌కమ్ : స్వలింగ సంపర్క జంటకు స్వాగతం.. ఎక్కడ?

దేశంలో స్వలింగ సంబంధాలను చట్టబద్ధం చేయడం జరిగింది. ఇందుకోసం అడ్డంకిగా ఉన్న సెక్షన్ 377ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ చట్టం రద్దు తర్వాత ఓ జంట పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ.. స్వగ్రామానికి రాలేదు. అయితే, ఈ సెక్షన్ రద్దు చేసిన ఒక యేడాది తర్వాత స్వగ్రామానికి వచ్చింది. ఈ జంట రాకపై ఆ గ్రామంలో మిశ్రమ స్పందన లభించింది. ఈ జంటలోని ఓ యువతి తండ్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయగా, మరో తండ్రి మాత్రం ఈ జంటకు స్వీట్లు తినిపించి ఇంట్లోకి స్వాగతం పలికారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్‌కు చెందిన ఇష్రత్‌ జహాన్‌, నగ్మా అనే ఇద్దరు యువతులు పంజాబ్‌లోని జలంధర్‌లోని ఓ చెప్పుల ఫ్యాక్టరీలో పని చేసేవారు. ఈక్రమంలో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. క్రమంగా ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి వారిద్దరూ లైంగికంగా కలవసాగారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇష్రత్‌ జహాన్‌ తండ్రి మాత్రం ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వారు అక్కడే రహస్యంగా పెళ్లి చేసుకుని ఉండిపోయారు. 
 
ఇంతలో మన దేశంలో స్వలింగ సంబంధాలను చట్టబద్ధం చేస్తూ, ఐపీసీ సెక్షన్ 377ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పును గత యేడాది సెప్టెంబరు ఆరో తేదీన వెలువరించింది. ఈ తీర్పు వెలువడి ఒక యేడాది అయిన సందర్భంగా ఆ జంట తమ గ్రామానికి వెళ్లింది. 
 
అయితే, ఆ జంట రాకను ఇష్రత్‌ జహాన్‌ తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ, దీనికి విరుద్ధంగా నగ్మా తండ్రి స్వీట్లు పంచుతూ వీరికి ఘన స్వాగతం పలికారు. ఇరుగు పొరుగువారు కూడా ఈ వేడుకలో చేరారు. నీలిరంగు జీన్స్, తెల్లచొక్కాలో నగ్మా, నల్ల సల్వార్, ఎరుపు కుర్తా ధరించిన ఇష్రత్‌తో కలిసి రాగా, అందరూ ఫొటోలు తీసుకున్నారు. ఈ వివాహాన్ని తాను అంగీకరిస్తున్నానని నగ్మా తండ్రి చెప్పగా, చుట్టుపక్కలవారు తమ కరతాళధ్వనులతో అభినందిస్తూ ఆశీర్వదించారు.