శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జులై 2020 (07:57 IST)

ఉగ్రవాదుల ఘాతుకం : కాశ్మీర్‌లో బీజేపీ నేత కుటుంబాన్ని కాల్చి చంపేశారు..

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ బీజేపీ నేత, ఆయన కుటుంబాన్ని కాల్చి చంపేశారు. ఈ దారుణం బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటన జరిగే సమయంలో బీజేపీ నేతకు కల్పించిన 8 మంది భద్రతా సిబ్బందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. కేంద్రపాలితప్రాంతమైన బందిపొరా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీజేపీ నేత షేక్ వాసిం, ఆయన తండ్రి, సోదరుడు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ దుకాణం బయట వాసిం కుటుంబం కూర్చున్న సమయంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 
 
తీవ్ర గాయాలపాలైన ముగ్గురినీ బాండిపొరా జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ నేత వాసిం బరీ, ఆయన తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ బషీర్‌పై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని, ఆసుపత్రికి తరలించేలోగానే వారు ప్రాణాలు కోల్పోయినట్టు జమ్మూకశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.
 
కాగా, వాసిం కుటుంబానికి 8 మంది భద్రతా సిబ్బందితో కూడిన రక్షణ ఉంది. అయితే, ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సమయంలో ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గార్డులను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.  
 
ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ ట్వీట్ చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. వాసిం మరణం పార్టీకి తీరని లోటని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. వాసి మృతికి జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రగాఢ సానుభూతి తెలిపారు.